May 22, 2014

వేదగిరి లక్ష్మీనరసింహస్వామి

వేదగిరి లక్ష్మీనరసింహస్వామి


ఎన్నో పుణ్యక్షేత్రాలున్న నెల్లూరు నగరానికి పడమటి దిక్కున 19 కి.మీ. దూరంలో నరసింహకొండ అనబడే వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నెలకొంది. 

క్షేత్రమహాత్మ్యం (పురాణకథనం)

మునిపుంగవుడు, సప్తఋషులలో ప్రథముడైన కాశ్యప మహర్షి లోకహితం కొరకు ఒక యాగాన్ని సంకల్పించారు. తగినచోటు కోసం భువిపై వెతకగా పినాకినీ నది ఒడ్డున తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే మూడు కొండచరియలు పక్కపక్కనే ఉండటం చూసాడు. యాగం చేయటానికి ఇదే అనువైన చోటు అని తెలుసుకొన్న మహర్షి, వేదగిరికి దక్షిణం దిక్కున ఉన్న ఒకగుహలో ఏడు యాగగుండాలను ఏర్పాటు చేసాడు. యాగం ఎటువంటి విఘ్నమూ లేకుండా జరగాలని గోవిందరాజస్వామి, ప్రసన్న లక్ష్మీదేవిని రక్షణకొరకు ప్రతిష్ట చేశారు. భూలోకంలో లభించే ఎన్నో ప్రత్యేకమైన పదార్థాలను యాగంలో ఆహుతి కావించారు. 

వైశాఖమాసం, స్వాతి నక్షత్రమందు చతుర్థశి రోజున, సంధ్యా సమయంలో ఈ యాగం మొదలైంది. యాగం ముగిసే సమయం ఆసన్నమైంది. అప్పుడు ముఖ్యమైన యాగగుండం నుండి ఒక జ్యోతి ప్రజ్వలించింది. అది అక్కడి నుండి వేదగిరిదాకా వెళ్ళి అక్కడొక గుహలోపలికి వెళ్ళింది. 

శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములలో నాల్గవది నారసింహావతారము. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని కాపాడుటకోసం ఒక స్థంభంలో ఉద్భవించి, ఆ తరవాత హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ కథనం మనకందరకూ తెలిసిన విషయమే. 

యాగగుండంలో జ్వలించిన జ్యోతి నరసింహావతారంలా కనిపించినందువల్ల కాశ్యప మహర్షి జ్యోతి వెళ్ళిన గుహలో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

రాతిగుహ రూపంలో ఉన్న ఈ గర్భగుడిలో నరసింహస్వామి ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం, చతుర్భుజుడై దర్శనమిస్తాడు. ఏ రూపమైతే హిరణ్యకశిపుడి మనసులో భయాన్ని కలిగించిందో - అదే రూపం భక్తులకు అందమైన రూపంలా గోచరిస్తుంది. ఏకళ్ళు అసురసంహరంలో ఉగ్రరూపం దాల్చాయో అవే కళ్ళు భక్తుల పాలిట కరుణ చూపిస్తున్నాయి. 

మూలవిగ్రహానికి క్రింది భాగంలో నరసింహస్వామి - లక్ష్మీదేవిల చిన్న రూపాలు చెక్కారు. స్వామికి ఎడమవైపున లోకరక్షణ కోసం యాగమాచరించిన కాశ్యపమహర్షి విగ్రహం చెక్కించారు. 

స్వామి ఆలయానికి ఉత్తరం వైపున అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారిఆలయ ప్రాకారాన్ని ప్రదక్షిణచేసి వస్తే అమ్మవారి సన్నిధికి కుడివైపున సంతానాన్ని ప్రసాదించే స్థలవృక్షమొకటుంది. పుత్రసంతానం కోరే స్త్రీలు అమ్మవారికి మొక్కుకొని, తరవాత ఒక వస్త్రంలో కాసునుకట్టి స్థలవృక్షానికున్న కొమ్మలకు కడతారు. వారి నమ్మకం ఎప్పుడూ వృథాకాలేదని అక్కడివాళ్ళకి గట్టి విశ్వాసం. 

బయట ప్రాకారంలోని దేవిసన్నిధికి ఎడమవైపున ఒక హుండీ ఉంది. ఆహుండీలో కానుకలు సమర్పించినవారు పాము, తేలు వంటి విషజంతువుల నుండి రక్షించబడతారని నమ్మకం. అందుకే ఆలయానికి వెళ్ళే భక్తులందరూ హుండీలో కానుకలు సమర్పిస్తారు.                     

కాశ్యపమహర్షి క్షేత్రపాలకుల్లా ప్రతిష్ఠ చేసిన గివిందరాజస్వామివిగ్రహం ఐదుతలల పడగతో ఉన్న ఆదిశేషుడిపై శయనించినట్లుంటుంది. ఆస్వామికి ఒక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం వేదగిరికి దక్షిణవైపున నరసింహస్వామి ఆలయానికి సుమారు 1 కి.మి.దూరంలో ఉంది. -

         
చారిత్రక కథనం

ఆరవశతాబ్దం, విప్రముఖ్యుడు అనే భక్తుడు వేదగిరి కొండపై నరసింహస్వామి కొలువై ఉండటం చూసి, ఆసమయంలో పాలిస్తున్న పల్లవరాజు విక్రమసింహుడిని కలుసుకొని నరసింహస్వామికి ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడు. పల్లవుల రాజముద్ర 'సింహం' కావటంవల్ల విక్రమసింహ పల్లవరాజు ఆ నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించాడు. 

ఆతరువాత ఈఆలయాన్ని విజయనగర రాజులు కూడా సంరక్షించి ఆలయాన్ని విస్తరించారు. ఆలయ నిర్వహణకోసం విజయనగర చక్రవర్తి కొన్నిగ్రామాలు భూదానంగా ఇచ్చి, నరసింహస్వామికి - లక్ష్మీదేవికి నగలను కానుకలుగా బహూకరించారు. 



 వైశాఖమాసంలో బ్రహ్మోత్సవము, రథోత్సవము మొదలైన ఉత్సవాలు పదిరోజులు జరుగుతాయి. 5 వ రోజున స్వాతి నక్షత్రమందు స్వామివారికి జరిగే గరుడసేవ వైభవంగా జరుగుతుంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండే కాకుండా దూరప్రాంతాల నుండీ కూడా స్వామిని దర్శించటానికి జనం తరలివచ్చి, స్వామి ఆశీస్సులు పొంది, సంతోషంగా ఇంటికి తరలివెళతారు. 

అందరికీ మంచిచేసి, ఆపదల నుండి, సంకటముల నుండీ కాపాడే లక్ష్మీనరసింహస్వామిని దర్శించి, ఆశీస్సులు పొందండి. 

                  

సర్వేజనా సుఖినోభవంతు
                                   

మనం తెలుసుకోదగిన కొన్నివిషయాలు.....శతావధానం, అష్టావధానం

మనం తెలుసుకోదగిన కొన్నివిషయాలు

శతావధానం

శతావధానంలో వందమంది పృచ్ఛకులకు వారు అడిగిన విషయాలమీద తడవకు ఒక పాదం చెబుతూ, వంద పద్యాలు చెప్పాలి. అన్నీ గుర్తుంచుకొని చివరకు ఆ వంద పద్యాలూ అప్పజెప్పాలి.


అష్టావధానం

అష్టావధానంలో ఎనిమిది మంది పృచ్ఛకులు ఉంటారు. అయినా ఇది శతావధానం కంటే కూడా ఎక్కువ కష్టమైనది. దీనికి ధారణశక్తి ఎక్కువగా కావాలి. సమస్య, వర్ణన, నిషిద్దాక్షారీ, వ్యస్తాక్షరీ, పురాణం, దత్తపది, ఆశుకవిత్వం, ఖేలనం(చదరంగం), గణనం(లెక్కపెట్టటం), వంటి ఎనిమిది అంశాలు ఉంటాయి. అవధానిని పద్యాలు ఆలోచించుకోనివ్వకుండా పృచ్ఛకులు అడుగడుగునా అడ్డుతగులుతుంటారు. అయినా ఏమాత్రం విసుక్కోకుండా, అలసిపోకుండా అందరికీ జవాబులు చెబుతూ, మధ్య - మధ్య చమత్కార ప్రసంగాలతో సభను రంజింపచేస్తూ చిట్టచివరికి అన్ని పద్యాలు జ్ఞాపకం పెట్టుకొని అప్పచెప్పాలి.


అష్టనాయికలు

కావ్యాలలో అష్టనాయికలను వర్ణిస్తారు. వారి పేర్లు 1) ప్రోషిత భర్తృక, 2)ఖండిత 3)కలహాంతరిత 4) విప్రలబ్ద 5)వాసకసజ్జిక 6)స్వాధీన పతిక, 7) అభిసారిక, 8) విరహోత్కంఠిత.
ఈ అష్టనాయికలు మమతరెడ్డిగారు తయారుచేసిన చిత్రాలు.  


అష్టదిగ్గజాలు

ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమ, సుపత్రీకం -- అనేవి దిగంతాలలోని ఎనిమిది గజాలు.

భువనవిజయంలోని అష్టదిగ్గజాలలో - అల్లసాని పెద్దన, నంది తిమ్మన, భట్టుమూర్తి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన్న, తెనాలిరామకృష్ణుడు, ధూర్జటి, మాదయగారి మల్లన.  

          

అష్టకష్టాలు

అష్టకష్టాలు పడటమంటే - దాస్యం, దారిద్ర్యం, భార్యలేకపోవటం, ఒకరిదగ్గర చేయిచాచి అడుక్కుతినే దుర్గతి పట్టడం, అడిగి లేదనిపించుకోవటం, అప్పు పడటం, ఇతరుల సహాయం మాత్రం లేకుండా... తన కృషి మీదనే ఆధారపడి బ్రతకడం, ఒంటరిగా త్రోవలో నడక సాగించడం.  

అష్టాదశ పురాణాలు

శ్లో!! మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుషటయం
అనాపలింగ కూస్కానీ
పురాణాని ప్రచక్షత!!

మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.

1)మత్స్య పురాణము 2)మార్కండేయ పురాణము 3)భాగవత పురాణము 4)భవిష్యపురాణము 5)బ్రహ్మపురాణము 6)బ్రహ్మ వైవర్త పురాణము 7)బ్రహ్మాండ పురాణము 8)వాయు పురాణం 9)వరాహపురాణము 10)వామన పురాణం 11)విష్ణు పురాణం 12)అగ్నిపురాణము 13)నారదపురాణము 14)పద్మపురాణము 15)లింగపురాణము 16)గరుడ పురాణము 17)కూర్మ పురాణము 18)స్కాంద పురాణము



అష్టాదశ పర్వాలు

భారతంలోని 18 పర్వాలను అష్టాదశ పర్వాలు అని అంటారు.
ఆదిపర్వం, సభాపర్వం, వనపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సాప్తికపర్వం, స్త్రీపర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం. 

               
అష్టాదశ వర్ణనలు

నగరం, సముద్రం, శైలం, ఋతువు, చంద్రోదయం, సూర్యోదయం, ఉద్యానం, జలక్రీడ, మధుపానం, రథోత్సవం, విప్రలంబం, వివాహం, కుమారోదయం, మంత్రం, ద్యూతం, ప్రయాణం, యుద్ధం, నాయకాభ్యుదయం.              

దశరూపకాలు

నాటకం, ప్రకరణం, బాణం, ప్రహసనం, దీమం, వ్యాయోగం, సమవాకారం, వీధి, అంకం, ఈహామృగం.          

నవరసాలు

మన కావ్యాలలో వర్ణింపబడే నవరసాలు - శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతం.   నవరసాల చిత్రాలు బాపూగారి బొమ్మల్లో.  

    
నవవిధ భక్తి ప్రభోదాలు

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం.  

    
పంచాంగం

జ్యోతిష్యంలో పంచాంగం అంటే - తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు.

ఉపవాసంలో పంచాంగం అంటే - జపం, హోమం, తర్పణం, అభిషేకం, బ్రాహ్మణ భోజనం.

ఇవేకాకుండా ఉపాయం, సహాయం, దేశకాశ విభజనం, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి - అనే ఐదింటిని కూడా పంచాంగాలు అని అంటారు.

          

దశోపనిషత్తులు

ఈశ, కేశ, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారిణ్యకములు.

                                      

May 21, 2014

ఆది శంకరాచార్యులు వారిని గూర్చి కొన్ని విషయాలు

ఆది శంకరాచార్యులు వారిని గూర్చి కొన్ని విషయాలు



భారతదేశ సమైక్యతకు, ధర్మసంస్థాపనకు శంకరభగవత్పాదులు చేసిన కృషి అత్యంత శ్లాఘనీయం. 'బ్రహ్మసత్యం, జగన్నిథ్య, జీవోబ్రహ్మైవనాపరః' అనే అద్వైతసిద్ధాంత సారాన్ని దేశం నలుమూలల ప్రచారం చేస్తూ, మతంపేరిట సాగుతున్న అరాచకాన్ని, అన్యాయాన్ని శాస్తవాదంతో ఖండిస్తూ తన జీవితకాలంలో రెండుసార్లు కాలినడకన దేశపర్యటనగావించిన మహాపురుషుడు.ప్రజలకు మార్గదర్శనం  చేయడానికి దేశం నాల్గు దిక్కుల .... తూర్పున - పూరీలో గోవర్ధన పీఠం, దక్షిణాన్న - శృంగేరీలో శారదా పీఠం, పశ్చిమాన్న - ద్వారకా పీఠం, ఉత్తరాన్న - బదరీలో జ్యోతిష్పీఠం ఏర్పరచి జాతిని సంఘటిత పరచిన కార్యశీలి శ్రీశంకరాచార్యులు. 

కేవలం పండితలోకానికే పరిమితమైన శాస్త్రచర్చలు, తర్కములు అద్వైతసిద్ధాంత ప్రచారమేకాక, సామాన్యప్రజానీకానికి అందుబాటులో వారివారి ఇష్టదైవాలను మనసారా కొలుచుకొనే విధంగా వివిధ దేవీదేవతలపై స్తోత్రాలు, అష్టకాలు రచించి 'మోక్షసాధనసామగ్ర్యాం భక్తీరేవగరీయసి' అని భక్తికి ప్రాధాన్యమిచ్చిన జగద్గురువు శ్రీశంకరాచార్యులువారు.

అవైదికము, అనాగరికము, భయంకరములైన అనేక తాంత్రిక పూజావిధానములను ఖండిస్తూ, ఇహపరసిద్ధికై 'ఆదిత్యమంబికావిష్ణుం గణనాధంచ మహేశ్వరం' అనే పంచాయతన పూజావిధనాన్ని ప్రవేశపెట్టి, షణ్మతస్థాపనాచార్యుడై, వైదిక సాంప్రదాయాన్ని పునరుత్తేజితం చేసిన పరివ్రాజకాచార్యులు శ్రీశంకరులు. 

ఒకేజాతి, ఒకేధర్మం పేరిట జాతి జనులను ఏకత్రితంచేసి, కాశ్మీరు నుండి కన్యాకుమారీ వరకు సోమనాధం నుండి గంగాసాగరం వరకు పర్యటించి, జాతీయసమైక్యతకు నిలువెత్తు ప్రతీకగ వెలుగొందిన ధర్మమూర్తి సాక్షాత్ శంకరులు ఆదిశంకరులు.